భూమి మీద అన్ని రకాలచోట్లా జీవం ఉంది. అయితే అన్ని రకాల చోట్లు ఒకే లాగా ఉండవు. అక్కడి జీవమూ అంతటా ఒకే రకంగా ఉండదు. ఈ భూమి మీదనే అంతరిక్షం, ఇతర గ్రహాల వంటి చోట్లు ఉన్నాయి. అంటే అక్కడ మనిషికి, మనిషి చుట్టూ ఉండే జీవులకు మనుగడ అసాధ్యం అవుతుంది. అటువంటిచోట్ల ఉండే జీవం గురించి పరిశోధనలు ముమ్మరంగా జరుగుతూనే ఉన్నాయి.
అసాధ్యం అనిపించిన చోట కొన్నిరకాల జీవులు కనిపించే సరికి ఉత్సాహం పెరుగుతుంది అంటున్నారు పరిశోధకులు. ఇదే పద్ధతిలో ఇతర గ్రహాల మీద, అంతరిక్షంలో ఇతర ప్రదేశాల్లో కూడా జీవం ఉండవచ్చు కదా!
``అంతా మనకే తెలుసు'' అనే భావం పరిశోధకులకు బలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో అనుకోని ఫలితాలు ఎదురయితే ఆలోచన మరింత ముందుకు సాగే వీలు కలుగుతుంది. సాధ్యాసాధ్యాల గురించిన ఆలోచన మారడం మంచిది కదా'' అంటారు ఈరంగంలో పరిశోధకులు.
మనకు తెలిసిన జీవులన్నీ హైడ్రోజన్, నైట్రోజన్, కర్బనం, ప్రాణ వాయువులు ఆధారంగా నిర్మితమయినవే. ఈ నాలుగు రసాయనాలు విశ్వమంతటా విస్తరించి ఉన్నాయి. అంటే విశ్వంలో ఎక్కడయినా జీవం ఉండే అవకాశం దండిగా ఉందనే అర్ధం! కనుగొనడానికి సమయం పడుతుంది. అదే రేపు కావచ్చు. మరో కొన్ని వందల ఏళ్లు పట్టవచ్చు.
ఇలాంటిదే మరొక ఆశారేఖ వంటి విషయం, సూర్యరశ్మి కిరణజన్య సంయోగక్రియలకు సంబంధించినది. మనకు తెలిసిన జీవ ప్రపంచానికి ఆహారం దొరికేది వీటివల్లనే. అలాగని జీవం ఎక్కడ ఉన్నా సూర్యరశ్మి సాయంతోనే తిండి తయారుచేసుకోవలసిన అవసరం లేదని కూడా ఋజువయింది. భూగర్భం లోతుల్లో బసాల్టిక్ శిలల పొరల్లో సూక్ష్మజీవులు కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నట్లు పది సంవత్సరాల క్రితమే కనుగొన్నారు. అవి పెరుగుతున్నచోట సూర్యరశ్మి మచ్చుకు కూడా లేదు. సూక్ష్మజీవులే కాక బాగా పరిణామం చెందిన ఇతర జీవులు కూడా ఎండసోకని చోట్ల బతుకుతున్నాయని సముద్ర గర్భాన్ని పరిశోధించిన అల్విన్ గోళం నిరూపించింది. సముద్ర గర్భంలోని వేడినీటి బుగ్గల దగ్గర రొయ్యలు, నోరులేని గొట్టం పురుగులు ఉన్నట్లు అల్విన్ గోళం చేసిన పరిశీలనల్లో తెలిసింది. ఇలాంటిచోట్ల జీవం ఎంతకాలం కొనసాగుతుంది? అంగారక గ్రహం లోపలి పొరల్లో కూడా జీవం ఉందా? యూరోపా ఉపగ్రహంలో సముద్రం ఉందంటున్నారు. అందులో జీవం ఉందా? జీవం ఉన్న చోట్ల కొంచెం ఉందా? అసలు లేనేలేదా? అనేవి జవాబులు అందవలసిన ప్రశ్నలు.
ప్రతి మూడు సంవత్సరాలకొకసారి ఖగోళ జీవశాస్త్రం గురించి ఒక సదస్సు జరుగుతుంది. ఇటీవలి సదస్సు జరిగింది హవాయీలో! అక్కడ కొన్ని చిత్రమయిన విషయాలను పరిశోధకులు చర్చించారు. వాటిలో ముఖ్యమయినవి `` అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉండడమే కాదు, వారు మనల్ని పరిశీలిస్తున్నారు కూడా'' అని ! ఇతర ప్రాంతాల బుద్ధి జీవులు చిన్న చిన్న యంత్రాలను భూమి మీదకు ప్రయోగిస్తున్నారని వారి ఉద్దేశం. మర మనుషుల లాంటి ఆ చిన్న పరికరాలు భూమి మీద దిగి పరిశీలనలు కొనసాగించి సమాచారాన్ని తమ వారికి అందజేస్తున్నాయంటారు వారు. అవెప్పుడో ఒక నాడు మన దృష్టికి వస్తాయని కూడా నమ్మకం . ఇంటర్నెట్లో ఇటువంటి సమాచారం ఏమయినా తెలుస్తుందేమో వేచి వెదకమంటారు పరిశోధకులు!
బుద్ధి జీవులు మనకు సందేశాలు, సమాచారాలు కనుక అందజేస్తే వాటిని అర్ధం చేసుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం అని సదస్సు ముందు పరిశోధకులు చర్చించుకున్నారని వార్త! అసలు ఈ నాటికే మన సంఘంలో ఇతర గ్రహాల బుద్ధి జీవులు వచ్చి మనలో మనుషులుగానే మసలి, వాళ్లు చేయవలసిందేదో చేస్తున్నారని ఎక్కడో ఒక అభిప్రాయం మెరిసింది. ఇది కథలో లాగా వినిపిస్తుంది. నిజం కాదనడానికి లేదు!
ఈ భూప్రపంచం మీద కోట్ల రకాల జీవులున్నాయి. వాటిలో ఒంటిపిల్లి రాకాసిలాగా మనిషి జాతి మాత్రం అదో పద్ధతిగా బ్రతుకుతున్నది. మనుషుల కంటే పురుగులు ఎక్కువగా ఉన్నాయి ఈ భూమి మీద. అయితే మిగతా కోట్లాది జీవులు చేయలేని మంచి పనులు, చెడ్డపనులు మనిషి మాత్రం చేయగలుతుండడం గమనించవలసిన సంగతి. మంచి పనులల్లో ఒకటి బుద్ధి జీవుల గురించి వెదకడం, ఏలియెన్స ఉన్నారో లేరో తెలియదు. ఉన్నారేమోనని అనుమానం మాత్రం నిండా ఉంది. ఉన్నారులే అనుకోవడానికి మన మధ్యనే ఆధారాలు వెదుక్కునే తెలివి కూడా ఉంది. అంటే హిందీలో `` భావం, రేపు కూడా తెల్లవారుతుందని నమ్మకం. మనం మరో నాలుగు రోజులు ఇలాగే ఉంటామని నమ్మకం. ఈ వరుస ఇలా ముందుకు సాగి విశ్వంలో ఎక్కడో సూక్ష్మజీవులే కాదు బుద్ధి జీవులు కూడా ఉండే ఉంటారని నమ్మకం.సాధారణంగా నమ్మకాలు వము్మకావడం లేదు.
బుద్ధి జీవులు కూడా ఏదో ఒకనాడు కనపడక పోరు!